ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని పర్యాటక కేంద్రంగా ప్రఖ్యాతి గాంచిన చాపరాయి జలపాతంలో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్హెచ్ 516 ఈ విస్తరణ అయిన తర్వాత. ఇక్కడ వ్యాపారం సాగించే గిరిజనేతరులు 1/70 భూబదలాయింపు చట్టానికి విరుద్ధంగా శాశ్వత షాపింగ్లు నిర్మించుకుంటున్నారు. జీవన ఉపాధి కోసం బొంగు చికెన్తో పాటు చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే స్థానిక గిరిజనులు చిన్న, చిన్న పాకలు వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు మాత్రం శాశ్వత షాపులు నిర్మించుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టీ పట్ట నట్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. చాపరాయి జలపాతంలో ఆర్అండ్బికి సంబంధించిన భూములతో పాటు ఫారెస్ట్ శాఖకు సంబంధించిన భూములు అనుకుని ఉన్నాయి. దీంతో, ఫారెస్ట్ శాఖకు సంబంధించిన భూమిని సైతం ఆక్రమించుకొని కొంతమంది షాపింగ్లు, శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గిరిజనేతరుడి షాపును వెంటనే నిర్మాణ దశలోని తొలగించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.










