Jan 04,2023 23:58

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అనిత

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : భయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మారిపోయారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖలోని టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పిరికి తనానికి పాస్‌పోర్ట్‌ తీసుకుంటే వైఎస్‌ జగన్‌ అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పరదాల మాటున సభలు నిర్వహిస్తున్నారని, జనాలలోకి వెళ్లాలంటే భయపడుతున్నారని విమర్శించారు. సిఎం సభల్లో నల్ల రంగు, పసుపు రంగు దుస్తులు కనపడకూడదంటున్నారని, ఇంత భయం దేనికని ప్రశ్నించారు. జగన్‌ భయపడుతున్నారనడానికి కుప్పంలో పోలీస్‌ చర్యలే నిదర్శనమన్నారు. కందుకూరు సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. గుంటూరులో ఘటన మాత్రం వైసిపి కుట్ర కనిపిస్తోందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జిఒ 1 ఇచ్చిన మరుసటి రోజే రాజమండ్రిలో ఇరుకు సందులో సిఎం జగన్‌ రోడ్‌ షో చేయవచ్చా అని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందితే మద్యం నిషేధించారా, కచ్చులూరులో బోట్‌ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందితే పర్యాటక ప్రయాణాలు ఆపేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిఎం జగన్‌ సభలు జరపడానికి, టిడిపి నేతలను అరెస్ట్‌లు చేయటానికే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షులు సర్వసిద్ధి అనంతలక్ష్మి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, కార్యదర్శి నక్క పద్మ పాల్గొన్నారు.