చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) 19వ కేంద్ర కమిటీ ఆరవ ప్లీనరీ సమావేశాలు నవంబరు 11వ తేదీన ముగిశాయి. ప్లీనం అనంతరం విడుదల చేసిన అధికారిక సమాచార పత్రానికి (తీర్మానం) ప్రత్యేక ప్రాధాన్యత వుంది. నూరేళ్లలో సిపిసి వెలువరించిన చారిత్రక ప్రాధాన్యతగల మూడవ తీర్మానమిది. సిపిసి శత వార్షికోత్సవాల సందర్భంగా ఈ ప్లీనం సమావేశాలు జరిగాయి.
సిపిసి ద్వితీయ శతాబ్ది ముగిసే లోగా సాధించదలచిన లక్ష్యాలను ఈ ప్లీనరీ తీర్మానంలో ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలు ఇలా వున్నాయి. 1.సిపిసి ఇరవయ్యవ జాతీయ మహాసభలను ముఖ్యమైన సమయంలో నిర్వహించాలి. నాటికి రెండవ శతాబ్ది లక్ష్యమైన చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా నిర్మించేందుకు అవసరమైన నూతన మార్గానికి చేరుకోవాలి. 2. ఆధునిక సోషలిస్టు దేశంగా చైనాను అభివృద్ధి చేయటం.3. సుదీర్ఘ కాలపు అణచివేతలు, లొంగుబాట్ల నుండి చైనా ప్రజలను విముక్తి చేసి వారి భవిష్యత్తును మార్చేందుకు సిపిసి పాటుపడింది. వారిని ''దేశాధి నేతలు'' (మాష్టర్స్ ఆఫ్ ద కంట్రీ)గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషిని కొనసాగిస్తుంది. ఈ పరిణామం ప్రవంచ మానవాళి చరిత్రను బలంగా ప్రభావితం చేసింది. 5. సిపిసి నేతృత్వం, నవ చైనాను ఆధునిక బాటలో నడుపుతూ మానవాళి అభివృద్ధికి నూతన నమూనాను సృష్టించింది. పలు కోణాల్లో ఆధునిక సోషలిస్టు సమాజ నిర్మాణానికి నూతన మార్గాలను ఆవిష్కరిస్తున్నది. 5. ఆధునిక సోషలిస్టు సమాజ నిర్మాణానికి నూతన పంధాలో చైనా ప్రజలను నడిపేందుకు అధ్యక్షుడు సీ జిన్పింగ్కు విశేష అధికారాలను కట్టబెట్టటం, నాయకత్వ బృందంలో అగ్ర స్థానంలో నిలపటం తీర్మానంలో కీలక అంశం.
మార్గదర్శిగా అగ్ర స్థానంలో జిన్పింగ్
చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అనేక సమస్యలను అధిగమించేందుకు మార్గాలను అన్వేషించాల్సి వుంది. ప్రధానంగా రెండు ప్రశ్నలు వారి ముందు పరిభ్రమిస్తున్నాయి. ఒకటి-చైనా లక్షణాలతో సోషలిస్టు సమాజాన్ని అభివృద్ధి చేయటం ఎలా? రెండు-అందుకు ఎలాంటి మార్క్సిస్టు పార్టీని నిర్మించాలి? ఈ కర్తవ్యాలను సిపిసి ఎలా సాధించాలన్నది ప్రధాన అంశంగా వారి ముందుంది. మొత్తం ప్రజలు, పార్టీ ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా జిన్పింగ్ కు అగ్ర స్థానం కల్పించబడిందని తీర్మానంలో పేర్కొన్నారు.
పశ్చిమ దేశాలు పునరాలోచించాలి
అతి అధికార కేంద్రీకరణ నూతన దుర్బలత్వాలకు, సమస్యలకు, పొరపాటు ధోరణులకు దారి తీస్తుందనేందుకు సందేహం లేదు. అందుకు జూన్ 2020లో లఢక్ సరిహద్దుల్లో జరిగిన సైనిక ఘర్షణలు వంటి స్వల్ప సంఘటనలను ప్రామాణికంగా తీసుకోకూడదు. సైద్ధాంతిక విబేధాలు వున్నంత మాత్రాన చైనా హేతు విరుద్ధంగా, దూకుడుగా వ్యవహరిస్తుందన్న పశ్చిమ దేశాల వాదనలతో భారత్ కొట్టుకుపోకూడదు. చైనాతో, ''సంఘర్షణ-ఆర్థికంగా వేరుచేయటం'' వంటి వ్యూహాలతో పశ్చిమ దేశాలు తాము కోరుకున్న లక్ష్యాలను సాధించలేవు. గత 30 సంవత్సరాలతో పోల్చినపుడు చైనా ఆర్థికాభివృద్ధి కొంత తగ్గవచ్చు. కేవలం ఆర్థిక విజయాలు ఆధారంగానే సిపిసి తమ ప్రజల మద్దతును కూడగట్టగల్గుతుందని పశ్చిమ దేశాలు భ్రమిస్తున్నాయి. వారి అంచనాలు ఎండమావి వంటివే. ఆర్థిక వెనుకబాటుతో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కానీ చైనా కమ్యూనిన్టు పార్టీ ఆధిపత్యం కేవలం ఆర్థిక అంశాల పైన మాత్రమే ఆధారపడి లేదని వారు గమనించాలి.
విస్తృతమైన, పటిష్టమైన ప్రజా పునాదితో సిపిసి
మెజారిటీ ఆమోదం తోనే చైనా కమ్యూనిస్టుల రాజ్యాధికారం కొనసాగుతున్నది. పశ్చిమ దేశాలకు అది విచిత్రంగా కన్పించవచ్చు. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై పశ్చిమ దేశాలకు కోపతాపాలు వుండవచ్చు. కానీ ప్రపంచంలోని పలువురు నియంతల అధీనంలోని ప్రభుత్వాల కంటే, అనేక ప్రజాస్వామిక దేశాల్లోని పాలక పార్టీల కంటే మించిన విస్తృతమైన, పటిష్టమైన ప్రజా పునాది సిపిసికి చైనాలో సమకూరింది. అందుకు పలు చారిత్రక సైద్ధాంతిక కారణాలున్నాయి. సుదీర్ఘ కాలం పశ్చిమ దేశాల పద ఘట్టనల కింద నలిగి, అణగారిన చైనా సమాజం, ప్రజలు తమ గతాన్ని ఇప్పటికీ మరచిపోలేదు. అందుకే తమ విముక్తి ప్రదాత అయిన సిపిసి నాయకత్వానికి ప్రజా క్షేత్రంలో ఆమోదం లభిస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలో అమలుకు సాధ్యమైన ప్రత్యామ్నాయమైన ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని నిర్వహించాలని సిపిసి నాయకత్వం నమ్ముతున్నది. సరళమైన విధానాలు లేకున్నప్పటికీ బీజింగ్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలకున్న నమ్మకాన్ని పశ్చిమ దేశాలు తక్కువ అంచనా వేస్తున్నాయి. మిగిలిన ప్రపంచం ఈ వాస్తవాన్ని గుర్తించటం ఎంతైనా అవసరం. కేవలం రాజకీయ స్వేచ్ఛలకున్న పరిమితులే సిపిసి నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకతగా మారుతుందనుకోవటం పెద్ద తప్పు.
అమెరికా వ్యూహంలో భారత్ కూరుకుపోరాదు
చైనా వ్యతిరేకతతో అమెరికా నాయకత్వం లోని చైనా వ్యతిరేక కూటమిలో భారత్ క్రమంగా కూరుకుపోతున్నది. ఈ వైఖరి వల్ల భారత్కు ప్రయోజనం ఏమిటి? చైనా ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలి? ద్వైపాక్షిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? పశ్చిమ దేశాల నమ్మకాలు, వైఖరులకు అనుగుణమైన సంఘర్షణాత్మక వ్యూహాలతో మనకు ప్రయోజనం లేదు. మన దేశ పరిస్థితులు, ప్రయోజనాలకు అనుగుణంగా స్వతంత్రంగా మన వ్యూహాలు రూపొందాలి.
భారత్ మరో ముఖ్యమైన సమస్యను కూడా ఎదుర్కొంటున్నది. భారత్, చైనాల్లో మొగ్గు ఏవైపు? అనేక దేశాలు చైనాతో సంబంధాలకే మొగ్గు చూపుతున్నాయి. అందుకు అనేక అత్యవసర కారణాలు అనివార్యం చేస్తున్నాయి. ఒత్తిడి చేస్తున్నాయి. ఈ మొగ్గు చైనాపై ప్రత్యేక అభిమానంతో కాదు. పాకిస్తాన్, కాంబోడియాలు అందుకు మినహాయింపు. మిగిలిన అనేక దేశాలు గతంలో భారత్కు సన్నిహితమైనవే. అందుకే తన ప్రయోజనాలకు అనుగుణంగా చైనా పట్ల భారత్ తన విధానాన్ని రూపొందించుకోవాలి.
/ వ్యాసకర్త : ఇంటిలిజన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ మాజీ సలహాదారు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ /
'ది హిందూ' సౌజన్యంతో సంక్షిప్తంగా
యం.కె. నారాయణన్











