Oct 28,2022 23:20

ప్రజాశక్తి - విజయవాడ : జిల్లాలో చేపట్టిన సాధారణ భూ సర్వే పనులు, జాతీయ రహదారి భూ సర్వే పనుల తీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌లతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా జెసి అజరు మాట్లాడుతూ గొల్లపూడి రైల్వే లైన్‌ సంబంధించి ప్లానింగ్‌ నోటిఫికేషన్‌ సకాలంలో పంపాలని ఆదేశించారు. జక్కపూడి ఫ్లైఓవర్‌ పనులకు అవార్డు పాసైందని, దీనికి సంబంధించి రైతులకు నష్టపరిహారం ఈ వారంలోగా పంపిణీ చేయాలని అన్నారు. జగ్గయ్యపేట ముత్యాలంపాడు ఇన్‌లాండ్‌ వాటర్‌ వేవ్‌ సంబంధించి అవార్డ్‌ను వచ్చే వారానికి పాస్‌ చేయాలన్నారు. చంద్రల-వెల్వడం సాధారణ భూ సర్వేకు సంబంధించి అవార్డ్‌ను వారం లోపు పాస్‌ చేయించి పంపాలని ఆదేశించారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా గ్రీన్‌ ఫీల్డ్‌ అలైన్మెంట్‌కు సంబంధించి 15 గ్రామాలు ఉన్నాయని, వీటిలో 14 గ్రామాలకు మార్కెట్‌ ధర ప్రతి పాదనలు సిద్ధం చేసి నవంబర్‌ ఆఖరునకు అవార్డు పాస్‌ చేయించాలన్నారు. నందిగామ బైపాస్‌ రోడ్డు త్రీడి నివేదికను సమర్పించాలని నందిగామ ఆర్‌డివోను ఆదేశించారు. ఈసమావేశంలో నందిగామ ఆర్‌డివో ఏ రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డివో జి.లక్ష్మి ప్రసన్న, ఆయా మండలాల తహాశీల్థార్లు పాల్గొన్నారు.