May 09,2023 01:04
పెట్రోలు బంక్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించాల్సిన పెట్రోలు బంక్‌ సిబ్బంది తమ చేతి వాటం ప్రదర్శించి నిలువునా దోపిడీకి గురి చేస్తున్నారు. భట్టిప్రోలు మార్కెట్‌ యార్డ్‌ వద్ద గల హెచ్‌పి బంక్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. సోమవారం ఒక వ్యక్తి వంద రూపాయలు ఇచ్చి ఆయిల్‌ కొట్టించాడు. అతను భట్టిప్రోలు నుంచి వెల్లటూరు వెళ్లి వచ్చేసరికి ఆయిల్‌ అయిపోయింది. మొత్తం 10 కిలో మీటర్లు కూడా తిరగక ముందే ఆయిల్‌ అయిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. దీంతో బంక్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు వినియోగదారులు కూడా తమను మోసం చేస్తున్నారని సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బంక్‌ యజమానిని పిలిపించాలని పట్టుపట్టా రు. హడావుడిగా వివిధ పనులపై వెళుతూ ఆయిల్‌ పొపించుకోవడానికి బంక్‌కు వచ్చి వంద, రెండు వందలకు ఆయిల్‌ కొట్టమని బైకు ట్యాంక్‌ మూత తీసి జేబులో డబ్బులు తీసేసరికి ఆయిల్‌ కొట్టటం అయిపోతుంది. పని హడావిడిలో ఉన్న వాహనదారు సొమ్ము ఇచ్చి వెళ్లిపోతూ ఉంటారు. తీరా చూస్తే పది నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్లే సరికి ఆయిల్‌ అయిపోతుంది. దీంతో కొందరు బండి బోరుకు వచ్చి ఆయిల్‌ మైలేజీ రావటం లేదని, మరికొందరు దీనిని గమనించకుండా ఆయిల్‌ అయిపోందని, మరోమారు ఆయిల్‌ కొట్టించు కుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇంకొందరు ప్రత్యేకించి పోసిన ఆయిల్‌ ఎంత? ఎంత మిలేజీ వచ్చింది అనేది గమనిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి అర్థమవుతుంది. ఆయిల్‌ తక్కువ వచ్చిందని. పెరిగిన వాహనాల వినియోగంతో పాటు బంక్‌లు కూడా పెరిగాయి. పెట్రోలు బంక్‌ల వ్యాపారం బాగా లాభసాటిగా ఉండటం తో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కొల్లూరు నుంచి భట్టిప్రోలుకు మధ్య దాదాపుగా 8 బంక్‌లు ఉన్నాయంటేనే పరిస్థితి ఇట్టే అర్ధమౌ తుంది. ఆయిల్‌ బంక్‌లో నాణ్యతా ప్రమాణాలు, కొలతలు, వినియోగదారులకు అందించాల్సిన సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ముంగటం వలననే బంక్‌లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బంక్‌లలో జరిగే అవినీతి అక్రమాలపై విచారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.