ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భాష్యం స్కూల్లో అడ్మిషన్ లేకపోయినా తరగతులు బోధిస్తూ రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూన్న భాష్యం స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, పట్టణ కార్యదర్శి విజరు డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఇఒ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎమ్మిగనూరులోని భాష్యం స్కూల్లో అడ్మిషన్ లేకపోయినా అక్రమంగా విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకుంటున్నారని తెలిపారు. మెరుగైన విద్యను బోధిస్తున్నామని తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల టీసీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని, తరగతులు మాత్రం భాష్యంలో జరుగుతున్నాయని తెలిపారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇలా అక్రమంగా విద్యను బోధిస్తూ ఫీజులు వసూలు చేస్తున్న భాష్యంపై విచారణ చేపట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా భాష్యం స్కూల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. భాష్యం స్కూల్కు సహకరిస్తూ ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను పంపుతున్న ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పట్టణ నాయకులు నితీష్, ఆనంద్, ప్రమోద్, మోహన్, బన్నీ పాల్గొన్నారు.
వినతి పత్రం అందిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు