ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
భారతదేశం నిజాయితీ గల పాలన కోరుకుంటోందని మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు సి.రంగయ్య తెలిపారు. ఎఐసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మొదటి లక్ష్యంలోనే జయకేతనం ఎగురవేసిన మల్లికార్జున ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల పట్ల శనివారం ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచనతో దళితుని ఎఐసిసి అధ్యక్షులుగా ప్రకటించిన క్షణమే జయకేతనం ఎగురవేసిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి రాష్ట్రానికి సేవ చేసి సొంతిళ్లు కూడా లేని నిజాయితీ పాలన చేసిన దామోదరం సంజీవయ్య సేవలను దృష్టిలో పెట్టుకుని దళితునికి ఎఐసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంలోనే కాంగ్రెస్ విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ ఆలోచించాలని తెలిపారు. దళితులు ఏకమైతే వార్ వన్ సైడ్ అయిపోతుందని, ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత దళితుల అభివృద్ధిని మరిచిపోతే ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలను పూర్తిగా మర్చిపోతారని తెలిపారు. రిజర్వేషన్లో భాగంగా దళితులకు ఎంత శాతం ఉంటే అంత శాతం రాజ్యాధికారంలో అవకాశం ఇచ్చిన పార్టీలను శాశ్వత ప్రజల అధికార పార్టీగా నిలుపుకుంటారని చెప్పారు. వివిధ గ్రామాల మాలలు పాల్గొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు