భారత డ్రాగన్ బోట్ శిక్షణ శిబిరానికి ఏపి క్రీడాకారులు
ప్రజాశక్తి - కర్నూల్ స్పోర్ట్స్
భారత డ్రాగన్ బోట్ తుది జట్టు ఎంపిక కోసం డ్రాగన్ బోట్ ఇండియా అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 16 వరకు కేరళ రాష్ట్రం అలిపిలో నిర్వహించనున్న శిక్షణ శిబిరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. క్రీడాకారులు రమేష్, గుప్త (కర్నూలు), లలిత ఆదిత్య (తిరుపతి)లు ఎంపికైనట్లు భారత సంఘం కార్యదర్శి రేజి కే.సుధాకర్ నుండి ఉత్తర్వులు అందాయని డ్రాగన్ బోర్డ్ ఎపి అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్లో జరగనున్న 16వ ప్రపంచ డ్రాగన్ బోట్ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డ్రాగన్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రెటరీ మంచికంటి అవినాష్, వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్ర శేఖర్, శిక్షకులు కాశీ రావు, యూసుఫ్, రాష్ట్ర అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు నాగరాజు, జిల్లా ప్రైవేట్ స్కూల్స్ పిఇటిల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న, నాయకుడు జైపాల్ తదితరులు పాల్గొన్నారు.










