ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎల్ ఉపేంద్ర ఆధ్వర్యంలో గురువారం ఒడిషా రాష్ట్రం అలమండ నుండి ఆంధ్రా ప్రాంతానికి నాటు సారా రవాణా జరుగుతుందన్న సమాచారంతో పార్వతీపురం మండలం రంగాలగూడ గ్రామ సమీపంలో మాటు వేసి 880 లీటర్ల నాటుసారాతో పాటు ఇన్నోవ కారును సీజ్ చేశారు. కొమరాడ మండలం పూడేసు గ్రామానికి చెందిన ఆరిక నరేష్ అలియాస్ వరుణ్, పార్వతీపురానికి చెందిన సిరిపురపు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ ఉపేంద్ర మాట్లాడుతూ పట్టుబడిన ఇద్దరినీ విచారించగా ఒడిషా రాష్ట్రం అలమండ గ్రామానికి చెందిన బెవరా శరత్ నాటు సారా సరఫరాదారుడుగా అంగీకరించడంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశామన్నారు. సదరు ఇద్దరు వ్యక్తులను రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్ఐ వి.వి.రమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.










