Aug 22,2023 19:16

ప్రజాశక్తి - మండవల్లి
    ఇండియన్‌ బ్యాంక్‌ డిజిటలైజేషన్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను మరింత సులభతరం చేసిందని బ్యాంక్‌ మేనేజర్‌ బొంతు దుర్గారావు తెలిపారు. స్థానిక ఇండియన్‌ బ్యాంకులో మంగళవారం నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన పాల్గొని ఖాతాదారులతో మాట్లాడారు. ఖాతాదారులకు అన్ని రకాల సేవలను ఇంటి వద్దకే అందించేలా డిజిటలైజేషన్‌ సేవలను తీసుకువచ్చిందన్నారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాలు తెరవడం, వ్యవసాయ రుణాలను పునరుద్దరించుకోవడం, రెన్యువల్‌, వ్యక్తిగత రుణాలు పొందడం వంటివి నిర్వహిస్తున్నామని తెలిపారు. జిఎస్‌టి రిటర్‌న్స్‌ వేసిన వారు రూ.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ వ్యాపార రుణాలను ఇంటి వద్ద నుంచి నిమిషాలలో ఆన్‌లైన్‌ ద్వారా ఏ విధమైన హామీ లేకుండా పొందవచ్చునని ఆయన తెలిపారు. ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేవిధంగా ఇండియన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఈ ఖాతాదారుల సౌకర్యార్థమై డిజిటలైజేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. ఖాతాదారులు ఈ సేవలను అందిపుచ్చుకుని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యత సభ్యులు ఎల్‌ఐసి భాస్కరరావు, ఎబిఎన్‌ వెన్నా పద్మకుమారి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ కె.కవిత, క్యాషియర్‌ బంగారం ముడుపుదారుడు కె.అమర్నాథ్‌, గుడివాడ వీరరాఘవయ్య, స్వర్ణకుమారి, వరద సత్య కోనరెడ్డి, ఉషారాణి, బుర్ర రాంబాబు, ప్రసాద్‌ పాల్గొన్నారు.