Oct 13,2022 23:19

సమావేశంలో మాట్లాడుతున్న జెసి శ్రీనివాస్‌

రాజకీయ పార్టీల ప్రతినిధులకు జెసి శివశ్రీనివాస్‌ సూచన
ప్రజాశక్తి -పాడేరు:
అన్ని రాజకీయ పార్టీలు బూత్‌ లెవెల్‌ ఏజంట్లను నియమించి తెలియజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జె.శివ శ్రీనివాసు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం, కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఓటర్లను దష్టిలో పెట్టుకొని పోలింగ్‌ బూత్‌ల మార్పులు, చేర్పులపై లిఖిత పూర్వక నివేదికలు అందజేయాలని సూచించారు. ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు, ఆధార అనుసంధానం తదితర అంశాలపై అవగాహన పెంచుకొని ఓటర్లను చైతన్య పరచాలని, ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
2022 నవంబర్‌ ఒకటవ తేదీ ప్రాతిపదికగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని జేసి కోరారు. ఈ నెల ఒకటవ తేదీ నుండి నవంబర్‌ 11 వరకు ఫారం 18 ద్వారా ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని, నవంబర్‌ 11న డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌, 23 నుంచి క్లైమ్స్‌, అభ్యంతరాలు స్వీకరిస్తారని, డిసెంబర్‌ 25వ తేదీన వాటిని పరిష్కరించటం జరుగుతుందని, తుది జాబితా 30న ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా కొన్ని మండలాల్లో దూరంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల సమస్యను జెసికి విన్నవించారు. సమావేశంలో వైసిపి తరుపున ఎస్‌. రాంబాబు, ఎస్‌. మంగలన్న దొర, టిడిపి తరపున గిడ్డి ఈశ్వరి, వి.గణపతి, కే. కొండబాబు, కే. కల్యాణం, సిపిఎం తరపున పాంగి లక్కు, బిజెపి తరుపున పాంగి రాజారావు, కాంగ్రెస్‌ తరపున ఎన్‌. నాగరాజు, కష్ణా రావు, తహశీల్దార్‌, వి. త్రినాధరావు నాయుడు, పర్యవేక్షకులు నాగజ్యోతి పాల్గొన్నారు.