సొంత నిధులతో చదరం గ్రామానికి తాగునీరు కల్పన
రూ.2.50లక్షలు వెచ్చించి గ్రావిటీ పథకం ఏర్పాటు
అపర భగీరథ యత్నంతో నీటి సదుపాయం
ప్రజాశక్తి-పెదబయలు రూరల్ : పెదబయలు మండలం బొండాపల్లి పంచాయతీ సర్పంచ్ బసుదొర మత్స్యరాజు ఔదార్యాన్ని చాటుకున్నారు. పంచాయతీ పరిధిలోని చదరం గ్రామంలో ప్రజలు గత కొన్నేళ్లుగా తాగునీటి కొరతతో గొంతెండి అల్లాడుతున్నా, అధికారులు నేతలు, పట్టించుకోకపోవడంతో తన సొంత నిధులు రూ.2.50 లక్షలతో గ్రావిటీ పథకాన్ని నిర్మించి గ్రామస్తుల గొంతు తడిపారు. సర్పంచ్ చొరవ, కృషికి గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.
బసుదొర మత్స్యరాజు బొండాపల్లి సర్పంచ్గా ఎన్నికైన నాటినుంచి చదరం గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని జిల్లాకలెక్టర్తోపాటు మండలస్థ్థాయి అధికారులు, నేతలకు మొరపెట్టుకున్నారు ఎన్నిసార్లు విన్నవించినా ఏ ఒక్కరి నుంచి స్పందన లేకపోవడం, మరోవైపు పంచాయతీకి ఎటువంటి నిధుల లభ్యత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లోతాను స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన సొంత నిధులు రూ.2.50లక్షలను వెచ్చించి, చదరం గ్రామానికి సుమారుగా రెండు కిలోమీటర్లు దూరాన ఉన్న కొండపైనుంచి గ్రావిటీ పద్ధతిన పైపులైన్ ఏర్పాటు చేసి, నీటినినేరుగా గ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ట్యాంకర్ను నింపి, ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. సొంత నిధులతో అపర భగీరథ యత్నంతో ప్రజల దాహార్తిని తీర్చిన సర్పంచ్ చొరవ, కృషికి గ్రామస్తులు అభినందిస్తున్నారు. గురువారం పథకాన్ని ప్రారంభించి, గ్రామస్తులకు అప్పగించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది నాగబాబు, విఆర్ఒ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నవీన్కుమార్, వార్డ్ సభ్యుడు నారాయణ, గ్రామ వాలంటీర్ వసంత కుమారి పాల్గొన్నారు.










