Oct 29,2023 00:25

కాలిళ్లతో బంతిపూలను తీసుకొచ్చిన గిరిజనులు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: బంతిపూల ధరలు హఠాత్తుగా పతనమవడంతో రైతులను కుంగదీసింది. మార్కెట్లో ధరలు లేక గిరిజన రైతులు అయోమయంలో పడ్డారు. రూ.150 నుంచి రూ.200 దాకా పలుకుతూ వచ్చిన బుట్ట పూలు ధర ఉన్నట్టుండి ఇప్పుడు దీని ధర రూ.50కి పడిపోయింది. దసరా పండుగ వరకు రూ.250 పలికిన బుట్ట బంతిపూలు ప్రస్తుతం రూ.50కు కూడా కొనేందుకు వ్యాపారస్తులు ఎవరూ ముందుకు రాలేదు. పూల ధరలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో తాము పండించిన పూలను ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాక రైతులు తక్కువ ధరకే అమ్మి ఉసూరున ఇళ్ల బాట పడుతున్నారు. ధర గిట్టుబాటు కాకపోవడంతో గ్రామాల నుంచి పాడేరుకు పూలు తీసుకు వచ్చే గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలోని పాడేరు మండలంలో లగిసపల్లి, డోకులూరు, బరిసింగి, ఇరడాపల్లి, డి.గొందూరు, గుత్తులపుట్టు, జి.ముంచంగిపుట్టు, గబ్బంగి, హుకుంపేట మండలంలో డి.చింతలవీధి, దిగుడుపుట్టు, శోభకోట, సంపంగిపుట్టు, చీడిపుట్టు, గడికించుమండ, అడ్డుమండ, సన్యాసమ్మపాలెం, దాలిగుమ్మడి, జి.మాడుగుల మండలంలో కె.కోడపల్లి, జి.మాడుగుల, సొలభం, పెదబయలు మండలంలో గంపరాయి, గలగండ పంచాయతీల్లో ఎక్కువగా బంతి తోటలు సాగు చేస్తున్నారు. రైతులు బంతిపూలను అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని పాత బస్‌ స్టాండ్‌ అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద మార్కెట్‌ కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. పూజల్లో అధికంగా ఉపయోగించే బంతిపూలకు మంచి డిమాండ్‌ ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని తదితర ప్రాంతాల నుంచి పూల వ్యాపారులు వచ్చి బంతిపూలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కొనుగోలు చేసిన బంతిపూలను మైదాన ప్రాంతాలకు వ్యాపారులు తరలిస్తుంటారు.
జిల్లాలో సాగు చేస్తున్న చిన్న బంతి పూలు (సీతమ్మ కాటుక రకం) ద్వారా ప్రతి ఏడాది గిరిజనులు మంచి ఆదాయం పొందుతారు. ఈ ఏడాది కూడా జిల్లాలో రైతులు భారీగానే బంతి తోటలు వేశారు. పూలు అధికంగా వస్తుండటంతో గిరిజనులు గత నెల రోజుల నుంచి పాడేరు పాత బస్టాండ్‌ మార్కెట్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున అమ్మకాలు జరుపుతున్నారు. దసరా పండుగ వరకు పూలను రూ.200 ధరతో విక్రయించారు. వ్యాపారులే నేరుగా గ్రామాలకు వెళ్లి బుట్ట పూలను రూ.150 నుంచి రూ.200 ధరతో కొనుగోలు చేశారు. దీంతో రైతులకు మంచి ఆదాయం లభించింది.