ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : ఇండియా-రష్యా (ఇంద్ర) నావికాదళాల సంయుక్త విన్యాసాలు ఈ నెల 28, 29 తేదీల్లో రష్యాలోని బాల్టిక్ సముద్రంలో జరిగాయి. ఇరుదేశాల మధ్య అంతర్గత భద్రతే కీలకంగా ఈ విన్యాసాలు నిర్వహించారు. ఇరు దేశాలూ 2003 సంవత్సరం నుంచి ఈ విన్యాసాలు చేపడుతూ వస్తున్నాయి. దీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను ఇండియా, రష్యా నేవీలు కొనసాగిస్తుందన్న దానికి ఇంద్ర విన్యాసాలే నిదర్శనమని భారత నావికాదళం శుక్రవారం ప్రకటించింది. రష్యా 325వ నావికాదళ దినోత్సవాన్ని సెయింట్ పీటర్స్బర్గ్లో జరుపుకుంటున్న సందర్భంగా భారత్ రష్యా (ఇంద్ర) విన్యాసాలు చేపట్టాయి. ఈ సందర్భంగా పలురకాల ఫ్లీట్లు, ఆపరేషన్స్, యాంటీ ఎయిర్డ్రిల్స్, హెలికాప్టర్ ఆపరేషన్స్, బోర్డింగ్ డ్రిల్స్ నిర్వహించారు. ఐఎన్ఎస్ తబర్ భారత నౌకాదళం నుంచి వెళ్లగా, రష్యన్ ఫెడరేషన్ నేవీ నుంచి కార్వెట్ ఆర్ఎఫ్ఎస్ జిలానీ నౌకలు ప్రాతినిథ్యం వహించాయి.