Oct 19,2023 22:57

  • మున్సిపల్‌ క్లాప్‌ ఆటో డ్రైవర్లు ఆందోళన

ప్రజాశక్తి-విజయవాడ: బకాయిపడిన వేతనాలు మంజూరు చేయడంతో పాటు ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని క్లాప్‌ ఆటో డ్రైవర్లు గురువారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఎపి మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగంనకు సంబంధించి నగరంలోని ఎక్సెల్‌ప్లాంట్‌తో పాటు మొత్తం ఆరు శానిటేషన్‌ సర్కిల్స్‌లో మునిసిపల్‌ క్లాప్‌ ఆటో డ్రైవర్లు వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ పని బంద్‌ చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు టి.ప్రవీణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, స్వయంభూ ట్రస్ట్‌ యాజమాన్యం క్లాప్‌ ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. సెప్టెంబర్‌ మాసం వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. పెరిగిన ధరలు, కార్మికులు చేస్తున్న శ్రమకనుగుణంగా నెలకు రూ.18,500 వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.