
ప్రజాశక్తి- మెంటాడ : గ్రీన్ అంబాసిడర్లకు బకాయి వేతనాలు చెల్లించే వరకూ పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు రాకోటి రాములు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బకాయి జీతాలు చెల్లించి, కొత్త హరిత రాయబారులను నియమించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహి ంచారు. మెంటాడలో హరిత రాయబారులను విధుల నుంచి తొలగించి కొత్త వారిని నియమిం చడం పట్ల గ్రామ సర్పంచ్, సచివాలయ కార్యదర్శి పై రాములు మండిపడ్డారు. కొత్త వారిని నియమిం చండి కాని గత ఆరేళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించవద్ధని ఎంపిడిఒ త్రివిక్రమ్ రావు వద్ద విన్నవించుకున్నారు. ఈ విషయంలో గ్రామ సర్పంచ్ కులవివక్ష చూపుతున్నారని హరిత రాయబారులు తమ గోడును ఎంపిడిఒకు తెలిపారు. యధావిధిగా తమను కొనసాగించి, బకాయి జీతాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తామారాపల్లి సోములు, మండల హరిత రాయబారుల సంఘం అధ్యక్షుడు అలమండ సన్యాసిరావు, ట్రేజరర్ అలమండ సూరి దేవుడు, పెంచాలి రాములమ్మ తదితర గ్రామాల హరిత రాయబారులు పాల్గొన్నారు.