ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో ఎంబిబిఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని బాపట్ల జిల్లా బిసి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంబిబిఎస్ అడ్మిషన్స్ ప్రక్రియ మొదటి విడత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 151ని అనుసరించి డాక్టర్ వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయ అధికారులు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారన్నారు. అయితే రెండో విడత అడ్మిషన్లలో ఈ జీవోను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. జీవో 550, జీవో 111ను అనుసరించి ఓపెన్ కాంపిటీషన్ సీట్లను మొట్టమొదట భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి డాక్టర్ వైఎస్సార్ వైద్య విశ్వ విద్యాలయ అధికారులు త్వరలో జరగబోయే మలివిడత ఎంబిబిఎస్ ప్రవేశాల్లో జీవో నెంబర్ 151, 550, 111 లను సక్రమంగా అమలు చేసి రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో చేజర్ల సతీష్, అడ్వకేట్ అంగలకుదురు నటరాజన్, బీసీ నాయకులు మోర్ల చిన వెంకటేశ్వరరావు పూర్వ గుంటూరు జిల్లా నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి చీమకుర్తి కృష్ణ చైతన్య, పరిశా వెంకటగౌడ్, చీమలదిన్నె నారాయణరావు పాల్గొన్నారు.










