Dec 05,2022 23:54

భీమిలిలో డీటీకి వినతిపత్రం అందజేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
బిసిల సమస్యలపై టిడిపి ఆధ్వర్యాన సోమవారం తహశీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు.

భీమునిపట్నం : బిసిల సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్ళించవద్దని, వారి సంక్షేమానికే కేటాయించాలని కోరుతూ జివిఎంసి 1, 2, 3, 4 వార్డుల టిడిపి నాయకులు సోమవారం డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనుబాబుకు వినతి పత్రం అందజేశారు. బిసి కార్పొరేషన్‌ ద్వారా చేతి వృత్తులకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, 1, 4 వార్డుల అధ్యక్షులు టి.సూరిబాబు, పాసి నరసింగరావు, నాయకులు కనకల అప్పలనాయుడు, మద్దిల సుబ్బారావు, పైడిపల్లి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
పిఎం పాలెం : బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలపై 6వ వార్డు టిడిపి ఆధ్వర్యాన వినతి పత్రం తహశీల్దార్‌ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మూడున్నర సంవత్సరాల నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వినతిలో పేర్కొన్నారు. జీవో 217ను రద్దుచేయాలని, బీసీలకు చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటుకు అందించే రాయితీలను పునరుద్దరించాలని, బీసీ స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆరో వార్డు అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌, బిసి సెల్‌ ఉపాధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి గరే గురునాథ్‌, వార్డు బిసి సెల్‌ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కంచరపాలెం :బీసీ సబ్‌ ప్లాన్‌ నిధుల మళ్లింపు ఆపాలని, జీవో 217ను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్‌చేస్తూ గోపాలపట్నం తహశీల్దార్‌కు పశ్చిమ నియోజకవర్గం బీసీ సెల్‌ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పొలిమేర సీతారాం, పెంటకోట అజరుబాబు, రాజమండ్రి నారాయణ, బుద్ధ త్రినాధ్‌, మళ్ల శంకరరావు, నరవ పైడిరాజు, తమ్మిన విజయకుమార్‌, మధు అన్సురి, గోపి, నాగరాజు, కాండ్రేగుల వెంకటరావు, ధర్మారావు, మహిళా నాయకులు నరవ అనూష, మదన్‌, సంతోష్‌ పాల్గొన్నారు.