
ప్రజాశక్తి-సీతమ్మధార : ఆల్ ఇండియా బిసి ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పెబ్బిలి రవికుమార్ ఎన్నికయ్యారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బిసి వర్గాల సమస్యల పట్ల జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బిసి వర్గాల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడ్ని నూతనంగా నియమించినట్లు తెలిపారు. చట్టసభల్లో బిసి వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం 56 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బిసి జనగణన జరపాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా బిసిల మద్దతుతోనే ఏర్పడుతుందన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ పరంగా బిసి వర్గాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో కేంద్ర కార్యాలయం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సౌత్ ఇండియా కన్వీనర్ కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిహెచ్.అప్పారావు, అప్పలరాజు, ఊర్వశమ్మ తదితరులు పాల్గొన్నారు.