ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న కోరారు. తమకు న్యాయం చేయాలని దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై మోడీ ప్రభుత్వ తీరు దారుణమని, ఈనెల 18న దేశవ్యాప్తంగా ఆందోళనలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కెవిపిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా మహిళా రెజ్లర్లు ఒలింపిక్లో బంగారు, కాంస్య పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. వారికి అండగా నిలవాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనవరిలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ అని, తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్య తీసుకోవాలని ఆక్షేపించిందని తెలిపారు. అయినా బిజెపి ఎంపీని కాపాడడం కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారుణులపైనా, వారి కుటుంబ సభ్యులపైనా దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడడం ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెట్టారని విమర్శించారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై పాశవికంగా దాడులకు పాల్పడటం దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం రెజ్లర్ల ఆందోళనకు స్పందించి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శిరీష, సురేష్, హుస్సేన్, జిల్లా కమిటీ సభ్యులు దాసు, మైనా, శ్రీకృష్ణ, గోవర్ధన్, అజిత్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న