ప్రజాశక్తి - క్రోసూరు : మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని, మహిళలపై దురాఘతానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మండలం కేంద్రమైన క్రోసూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ బిజెపి అవకాశవాదమే మణిపూర్ మంటలకు కారణమన్నారు. అల్లర్ల కారణంగా దాదాపు 60 వేల మంది కుకీలు నిరాశ్రయులయ్యారని, మహిళలపై వీడియో వైరల్ అయ్యే వరకూ ప్రధాని స్పందించలేదని మండిపడ్డారు. అడవుల్లోని ఖనిజ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు అప్పచెప్పే కుట్రలో భాగంగా అక్కడ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. బిఎస్పి నియోజకవర్గ నాయకులు జి.శేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు జరిగిన దాడుల తరహాలోనే ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నాయని చెప్పారు. ఎంఆర్పిఎస్ నాయకులు దాసు మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారతదేశంలోని ప్రజలందరికీ మత స్వేచ్ఛనిచ్చిందని, ఒకరిని ఒకరు చంపుకోవాలని ఏ మతమూ చెప్పదని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ ప్రభాకరరావు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఖండించాలన్నారు. టిడిపి నాయకులు మల్లాల రామాంజనేయులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తాయన్నారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు సిహెచ్ ఏషియా, టిడిపి నాయకులు డి.యోహాన, యు.రోశయ్య, మొగల్ జాన్, ఐద్వా నాయకులు టి.విజయ కుమారి, శుక్రాభి, డి.స్వప్న, మాజీ ఎంపిటిసి కె.రామాంజ నేయులు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు మండల కార్యదర్శులు జి.చిన్నప్ప, మురళి, ఇశ్రాయేలు, సురేంద్ర, నాగమల్లి, డివైఎఫ్ఐ నాయకులు ఉదయ భాస్కర్, రాజు, రమేష్ పాల్గొన్నారు.










