Jun 24,2023 20:29

మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
మూసివేయబోతున్న హాస్టల్‌ను ఆలూరు మండల కేంద్రానికి తరలించి విద్యార్థుల అభివృద్ధికి దోహదపడాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు కోరారు. శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మైనా మాట్లాడారు. హాలహర్వి మండలం కొక్కెరచెడు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు, పక్క గ్రామాల విద్యార్థుల కోసం బీసీ హాస్టల్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. గత మూడేళ్ల నుంచి హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. ప్రస్తుతం హాస్టల్‌లో పదిమంది విద్యార్థులే ఉండడంతో అధికారులు హాస్టల్‌ను మూసివేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఉన్న హాస్టల్‌ మూసివేస్తే కొత్త హాస్టల్‌ను ఏర్పాటు చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు లేనందున హాస్టల్‌ను మూసివేయకుండా ఆలూరు మండల కేంద్రానికి తరలించాలని కోరారు. ఆలూరులో ఎస్సీ సమీకృత హాస్టల్‌లో బీసీ విద్యార్థులకు తక్కువ సీట్లు కేటాయించడంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి కొర్కురచేడు గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్‌ను ఆలూరుకు మార్చాలని కోరారు. గర్ల్స్‌ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లోనూ బీసీ సీట్లు పెంచాలని తెలిపారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కెపి.నారాయణ స్వామి, నాయకులు షాకీర్‌, డివైఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు ధనంజరు, నాయకులు పరమేష్‌, మల్లికార్జున, రంగస్వామి పాల్గొన్నారు.