Aug 04,2021 11:54

కోల్‌కతా/భోపాల్‌ : పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాలకు బెంగాల్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. భారీ వర్షాలకు తోడు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌(డివిసి) ఆధ్వర్యంలోని పంచెట్‌, మైథాన్‌ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడంతో ఆరు జిల్లాలు నీట మునిగాయి. తూర్పు వర్ధమాన్‌, పశ్చిమ వర్ధమాన్‌, పశ్చిమ మెదినీపుర్‌, హూగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారని, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. కేంద్రం ఆధ్వర్యంలోని డివిసి కావాలనే ఆనకట్టల నుంచి నీటిని ఎక్కువస్థాయిలో విడుదల చేసిందని, దీనివల్లే కఅత్రిమ వరద ఏర్పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సౌమెన్‌ మహాపాత్ర ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో 1,171 గ్రామాలకు పైగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివ్‌పురి, షియోపుర్‌ జిల్లాల్లో మునుపెన్నడూ లేని రీతిలో 800 మి.మీ. వర్షపాతం నమోదైంది. 200 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దటియా నుంచి రత్నగఢ్‌ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. 2013లో ఇదే వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మరణించారు.