ప్రజాశక్తి-బెలుగుప్ప మండలంలోని స్థానిక మాంగోటి చెరువు పూర్తిగా నిండేంత వరకూ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని వదలాలని వైసిపి నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. చెరువుకు వస్తున్న నీటిని నిలిపివేయడంతో స్థానిక వైసిపి నాయకులు, రైతులు జీడిపల్లి రిజర్వాయర్ దగ్గరకు చేరుకుని 35 ప్యాకేజీ కింద గొల్లపల్లి రిజర్వాయర్ పంప్హౌస్ కాలువ ద్వారా తరలిస్తున్న నీటిని బంద్ చేయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెలుగుప్ప మాంగోటి చెరువు, శీర్పి చెరువులకు నీరు ఇస్తామని చెప్పిన అధికారులు పది రోజుల కిందట నీటిని వదిలారన్నారు. కానీ శీర్పీ చెరువుకు మాత్రమే నీరు వదిలి మాంగోటి చెరువుకు ఒకరోజు మాత్రమే నీరు విడుదల చేయడం బాధాకరమన్నారు. వెంటనే మాంగోటి చెరువును పూర్తిగా నింపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు నాయకులతో ఫోన్లో మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి డిఇ 80 శాతం మంగోట్టి చెరువు నిండిందని తెలపడంతో నీటిని బంద్ చేసినట్లు తెలిపారు. చెరువు పూర్తిస్థాయిలో నిండేందుకు సమయం పడుతుందని చెప్పవడంతో తిరిగి నీటిని విడుదల చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఎట్టకేలకూ సాయంత్రం నాలుగు గంటల నుంచి మాంగోటి చెరువుకి నీరు వదలడంతో రైతులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దన్న, మండల కన్వీనర్ మచ్చన్న, జెసిఎస్ కన్వీనర్ శ్రీనివాసులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, సింగిల్విండో డైరెక్టర్ శివలింగప్ప, అశోక్, గోపాల్, తిమ్మారెడ్డి, పాతన్న, నాగిరెడ్డి, నారాయణస్వామి, పూల ప్రసాద్, రాము, బ్రహ్మయ్య, తిప్పే స్వామి, రైతులు, తదితరులు పాల్గొన్నారు
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, రైతులు










