Jul 26,2023 19:10

విద్యాధికారులతో మాట్లాడుతున్న వేణుగోపాల్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, ఎస్‌ఎస్‌ఎ పిఒ డాక్టర్‌ కె.వేణుగోపాల్‌ విద్యాధికారులకు సూచించారు. బుధవారం చిప్పగిరి మండల కార్యాలయంలో ఎంపిడిఒ కొండయ్య అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు, విద్య శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో డ్రాపౌట్స్‌ విద్యార్థుల గురించి తెలుసుకొని వారిని పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలో మొత్తం 1,072 మంది విద్యార్థులు చైల్డ్‌ ఇన్ఫోలో లేరని, వాలంటీర్ల సహాయంతో వివరాలను సేకరించి పొందుపరచాలని సూచించారు. మండలంలో ఉన్న విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో చదువుతుంటే వారి వివరాలను కూడా సేకరించి వారిని అవుట్‌ సైడ్‌ స్టేట్‌లో పొందపరచాలన్నారు. అలసత్వం వహించిన విద్యాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చిప్పగిరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్‌ విద్య బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంఇఒలు సావిత్రమ్మ, బాల నాయుడు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ రామనీలా పాల్గొన్నారు.