బడి బయట పిల్లలను బడిలో చేర్చండి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : బడి బయట పిల్లలను బడిలో చేర్చడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జి.ఇ.ఆర్ సర్వేపై మంగళవారం కమిషనర్ బి.నాగేశ్వరావు ఎ.సి.ఎస్.ఆర్ కాలనీ సచివాలయం, ఆర్.డి.ఒ ఆఫీస్ సచివాలయం సిబ్బంది వలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిబయట పిల్లలందరినీ బడిలో చేర్చేందుకు సచివాలయం సిబ్బంది, వలంటీర్లు కలిసి సమిష్టిగా పని చేయాలని ప్రతి ఒక్కరినీ కలుపుకొని పిల్లలందరూ బడిలో చేరే వరకు ప్రతిరోజు ఒక స్పెషల్ డ్రైవ్లాగా పని చేయాలని తెలియజేశారు. సాధ్యమైనంత ఎక్కువ మంది బడిలో ఉండేటట్లుగా చూసి చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయించి వలంటీర్ల యాప్లో గ్రీన్ టిక్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. స్కూలు మానేసిన 15 సంవత్సరాల పైబడిన వారిని ఓపెన్ స్కూల్, ఓపెన్ కాలేజీలలో చేర్పించడానికి తల్లిదండ్రులతో, విద్యార్థులతో మాట్లాడి వారిని బడిలో చేర్చే విధంగా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ దృష్టి నిలిపి ప్రగతి సాధించి ఆత్మకూరు మున్సిపాలిటీని ముందంజలో ఉంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.










