ప్రజాశక్తి - నెల్లిమర్ల : విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి చేపట్టనున్న ఉత్తరాంధ్ర బైక్ ర్యాలీను జయప్రదం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి బి. రమణ కోరారు. బైక్ ర్యాలీ బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం వస్తున్న సందర్బంగా మంగళవారం ఏపి బెవరేజస్లో గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం వై జంక్షన్ వద్ద బైక్ ర్యాలీకు స్వాగతం పలికి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం జంక్షన్కు చేరుకుని సభ నిర్వహిస్తామని చెప్పారు. బైక్ ర్యాలీను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎపి బెవరేజేస్ నాయకులు శ్రీను, సిఐటియు నగర కమిటీ సభ్యులు కంది త్రినాథ్ పాల్గొన్నారు.
కొత్తవలస: విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో గోడ పత్రికలను మంగళవారం కొత్తవలసలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. 32మంది ప్రాణ త్యాగాలు, వీరోచిత పోరాటంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస ముఠా కార్మికులు పాల్గొన్నారు.
డెంకాడ: ఉక్కు పరిరక్షణ కోసం చేస్తున్న బైక్ ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బచ్చల సూర్యనారాయణ కోరారు. భోగాపురం మండల కేంందలో మంగళవారం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం విజయనగరంలో జరగనున్న బైక్ ర్యాలీ, బహిరంగ సభను పెద్ద ఎత్తున కార్మికులు, కూలీలు పాల్గొవాలని కోరారు.










