ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్ర, శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సహాయ సహకారాలతో బుధవారం కందుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కందుకూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలపై శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని కందుకూరు డివిజన్ ఉపవిద్యా శాఖ అధికారి శ్రీనివాసరావు ఉపాధ్యాయులను ఉద్ధేశించి మాట్లాడారు. మారుతున్న పరిస్థితుల దష్ట్యా సాంకేతికతను జోడించుకుంటూ సాంప్రదాయ విజ్ఞానాన్ని మేళవించుకుంటూ విద్యార్థినీ విద్యార్థులచే ఉత్తమ పరిశోధనా పత్రాలను సమర్పింప చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన అంశం , ఉప అంశాలను జిల్లా అదనపు సమన్వయకర్త డాక్టర్ సిహెచ్ మారుతి కేశవకుమార్ విపులంగా వివరించారు. విషయ నిపుణులు ప్రభాకర్ కొన్ని పరిశోధనలను ఉదాహరిస్తూ పరిశోధనా పత్రం ఎలా సమర్పింప చేయాలో చక్కగా వివరించారు. మొత్తం 38 మంది డిబిషన్ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎపి రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా సమన్వయకర్త జెవి రమేష్ సమన్వయంతో జరిగింది.










