ప్రజాశక్తి- లీగల్ రిపోర్టర్ : బాలలకు రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్, పోలీస్ అధికారులకు జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జి.శ్రీదేవి సూచించారు. గురువారం న్యాయ సేవా సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ జిల్లా యూనిట్, పోలీస్ అధికారులకు, సిడబ్ల్యుసి సభ్యులకు నిర్వహించే అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వళనతో ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెకెవి.బులికృష్ణ బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. ప్యానల్ లాయర్ ఆర్.శ్రీనివాసరావు అరెస్టులు, బెయిల్ పిటిషన్లపై వివరించారు. బాధితులకు పరిహారం చట్టంపై ప్యానల్ లాయర్ విద్యాశంకర్ కండెన్వాలా తెలియజెప్పారు. జిల్లా ప్రొఫెషన్ ఆఫీసర్ ఎం.శరత్కుమార్ వివిధ చట్టాలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఎసిపి హర్షిత, పలువురు పోలీసు అధికారులు, సిడబ్ల్యుసి సభ్యులు పాల్గొన్నారు.










