ప్రజాశక్తి -కొయ్యూరు: మండలంలోని అంతాడ పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులు రీమల శ్రీనివాస్, రాట్ట మంగ, రీమల ఎర్రయమ్మ కుటుంబాలకు అరకు ఎంపీ గొట్టేటి మాధవి సూచనల మేరకు 'నేను సైతం' ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.15వేలు ఆర్థికసాయం అందించారు.
ఈ ప్రమాదంలో సర్వం బూడిద కావడంతో నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను నేను సైతం ఛారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ గురువారం పరామర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు కుటుంబాలకు రూ.15వేలు సాయం అందించారు. కాగా అగ్ని ప్రమాద బాధితులలో రాట్ట మంగ అనే గహిణి ఎనిమిది నెలలు గర్భిణిగా ఉండడంతో ఆమెకు ప్రత్యేకంగా మానవతా దృక్పథంలో పాల్రాజ్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టాప్ మరో రూ.ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
గతంలో ఇదే పంచాయతీకి చెందిన ఏడు కుటుంబాలు అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోతే వారికి నేను సైతం ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇళ్లు కట్టించి ఇచ్చినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ రాజశేఖర్, నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ పంచాడా శ్రీరామమూర్తి, స్థానిక సర్పంచ్ రీమల చంద్రరావు., బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు నర్సి కిరణ్, కొయ్యూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రీమల గంగాధర్ పాల్గొన్నారు.










