ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ కాకినాడ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే తమ అవినీతి, భూ కబ్జాల, అరాచకాలను కప్పి పుచ్చుకునేందుకు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని టిడిపి ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, గదులు సాయిబాబా, ఒమ్మి బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నగర పరిధిలోని సురేష్ నగర్ మున్సిపల్ పార్క్ ప్రభుత్వ భూమిపై దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన ఎంఎల్ఎ దోపిడీపై వనమాడి కొండబాబు పూర్తి ఆధారాలతో అధికారులు దష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తున్నారన్నారు. రూ.130 కోట్ల భూ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపికి చెందిన జంప్ జిలానీ సుంకర విద్యాసాగర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసత్యాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాడన్నారు. కొండబాబు కార్పొరేటర్కు టిక్కెట్ ఇచ్చి నెగ్గిస్తే విశ్వాసం లేకుండా సాగర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడన్నారు. స్వార్థం కోసం కార్పొరేటర్లను ప్రలోభ పెట్టి ఆయన భార్య సుంకర శివ ప్రస్సన్నను మేయర్గా ఎలా చేశాడో నగర ప్రజలకు తెలుసన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిత్వం కొండబాబుదని, అధికారంలో ఉన్నప్పుడు అక్రమ వ్యాపారాలతో దోచుకుని అధికారం పోయాక దోచుకున్న సొమ్ముతో ఇతర రాష్ట్రాలకు పారిపోయే ద్వారంపూడికి పోలికేటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడు వీరు, మూగు రాజు, ఏరిపిల్లి రాము, చోడిపిల్లి సతీష్, మాదే అంద్రియ్య, నిద్రబింగి సత్తిబాబు, గుమ్మల్ల చిన్నా, మల్లాడి లోవరాజు పాల్గొన్నారు.










