
- మారథాన్ ప్రారంభంలో కలెక్టర్ డిల్లీరావు
ప్రజాశక్తి-హెల్త్ యూనివర్సిటీ
గుండె సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మారథాన్-2023 నిర్వహించారు. మారథాన్ను ఇందిరాగాంధీ స్టేడియం వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన శైలిలో మార్పుల కారణంగా అనేక మంది హృద్రోగాల బారినపడుతున్నారన్నారు. వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ అధినేత డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ గుండె వ్యాధుల పట్ల అవగాహన కలిగి వుండటం, వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా గుండెకు రక్షణ లభిస్తుందని అన్నారు. ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, శారీరక వ్యాయామం చేయడం, సరైన ఆహారపు అలవాట్లను అవలంభించడం ద్వారా గుండె వ్యాధుల బారినపడకుండా జాగ్రత్త వహించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ అర్జునరావు, తొండెపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.