
ప్రజాశక్తి -ములగాడ : అవార్డులు బాధ్యతను పెంచుతాయని ప్రముఖ న్యాయవాది జికెవి.రాజు అన్నారు. స్థానిక ప్రకాష్నగర్లోని మల్కాపురం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి అజరుకుమార్కు అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. అంకితభావం, క్రమశిక్షణ, చిత్తశుద్ధి గల వారిని అవార్డులు వరిస్తాయన్నారు. సన్మాన గ్రహీత అజరుకుమార్ మాట్లాడుతూ, అందరి సహకారంతో తాను విధులను నిర్వహిస్తున్నానని, తనకు అవార్డు రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయులు ఎస్.చలపతిరావు, రచయిత కె.సత్తిరాజు, కార్మిక నాయకులు సత్యానందం, జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి తదితరులు ప్రసంగించారు. అనంతరం అజరుకుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, స్థానిక ప్రజలు, పాత్రికేయమిత్రులు, ఇతర గ్రంథాలయ అధికారులు, సామాజిక సేవకులు, జాతీయ సేవా పథక కార్యకర్తలు పాల్గొన్నారు.