ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : సిఐటియు
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో టాటా మ్యాజిక్ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం వి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి టి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక నిరుద్యోగంతో ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పులు చేసి ఆటో నడుపుకుంటూ కుటుంబంలో పోషించుకుంటున్నారని అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నేటికీ నాలుగేళ్ల నరకావస్తున్న హామీని అమలు చేయలేదు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ,డీజిల్, ఆటో స్పేర్ పార్ట్స్ ధరలు పెంచి ఆటో కార్మికుల పైన అనేక భారాలు వేయడం జరుగుతుందన్నారు. తక్షణమే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేసారు. లేనిపక్షంలో ఆటో కార్మికుల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం టాటా మ్యాజిక్ ఆటో వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులు వి వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కాజా, సహాయక కార్యదర్శి వెంకటేశ్వర్లు, ట్రెజరీగా పి సుభాన్, వీరితోపాటు ఐదుగురు కమిటీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, మధు గౌడ్, శివ, సురేష్, తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు.










