Jul 21,2022 22:59

నవజాత శిశువులతోఆసుపత్రి వైద్య బృందం

ప్రజాశక్తి - ఆరిలోవ : అతితక్కువ బరువుతో పుట్టిన శిశువులకు పునర్జన్మ ప్రసాదించడంలో ఆరిలోవ హెల్త్‌సీటిలోనీ రెయిన్‌బో ఆసుపత్రి ముందు వరుసలో ఉంటోంది. ఇటీవల 26 వారాలకే కేవలం 430 గ్రాముల బరువుతో పుట్టిన అతి చిన్న శిశువులలో ఒకడైన అర్జున్‌వర్మ ఆయువును నిలిపేందుకు రెయిన్‌బో డాక్టర్ల బృందం చాలెంజింగ్‌గా తీసుకుని సఫలీకృతమైంది. 85రోజులపాటు ఆసుపత్రిలో చికిత్సను అందించి, ఆరోగ్యపరంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి అర్జున్‌వర్మకు ప్రాణదానం చేసింది. ఇదే ఆసుపత్రిలో మరో నలుగురు నెలలు నిండకుండానే జన్మించిన శిశువులను సైతం గురువారం నిర్వహించిన ఎన్‌ఐసియు గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో డిశ్చార్జ్‌ చేసింది.
గురువారం ఆసుపత్రిలో మీడియాసమావేశంలో క్లినికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దినేష్‌ కుమార్‌ చిర్ల మాట్లాడుతూ, డాక్టర్‌ రాగసుధ, డాక్టర్‌ విశాల్‌ కోలీ, డాక్టర్‌ అన్వేష్‌ అమితి, డాక్టర్‌ శ్రీలత పులిలతో కూడిన నిష్ణాతులైన రెయిన్‌బో నియోనాలజిస్ట్‌లు బృందం ఇప్పటివరకు ఒక కిలో కంటే తక్కువ బరువున్న 1200 మందికి పైగా శిశువులను కాపాడారని వెల్లడించారు. వీరిలో అగేయాసియాలో అతి చిన్న శిశువుగా చరిత్ర సృష్టించడంతో పాటు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న 375 గ్రాముల బరువు కలిగిన శిశువు కూడా ఉందన్నారు. అద్భుతమైన నర్సింగ్‌ కేర్‌, అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులో ఉండడమే విజయానికి కారణాలన్నారు. సమావేశంలో రెయిన్‌ బో హాస్పిటల్‌ యూనిట్‌ హెడ్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ శశ్వత్‌ మొహంతీ, డాక్టర్‌ యశ్వంత్‌రెడ్డి, డాక్టర్‌ ఎంఎన్‌వి.పల్లవి, డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ నిహారిక అల్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.