Sep 21,2023 20:54

సమావేశంలో మాట్లాడుతున్న పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు ఇంజినీర్‌ బిబి సరిత

ప్రజాశక్తి-విజయనగరం : ఆసుపత్రి వ్యర్ధాల నిర్వహణ అత్యంత కీలక ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి స్పష్టం చేశారు. భద్రంగా సురక్షితమైన ప్రదేశానికి ఆసుపత్రి వ్యర్ధాలను తరలించి, వాటిని విభాగాల వారీగా వేరుచేసి సమర్ధవంతంగా తొలగించే ప్రక్రియపై దృష్టి పెట్టాలని సూచించారు. బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా పర్యవేక్షక కమిటీ సమీక్షా సమావేశం గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగింది. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణకు జిల్లాలో తీసుకున్న చర్యలను పొల్యూషన్‌ ఇంజినీర్‌ బిబి సరిత వివరించారు. ప్రతి ఆసుపత్రిలో నిర్ధేశిత రంగుల్లో ప్రత్యేక చెత్త బుట్టలను ఏర్పాటు చేసి, వ్యర్థాలను వాటిల్లోనే వేయాల్సి ఉంటుందని చెప్పారు. అనుమతి పొందిన సంస్థ ద్వారా 48 గంటల్లోగా చెత్తను భద్రంగా తరలించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రయివేటు ఆసుపత్రులతోపాటు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వ్యర్ధాల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆసుపత్రి వ్యర్ధాలు బయటి వ్యర్థాలతో కలిపి ఎక్కడికక్కడ పడేస్తే, వివిధ రకాల వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల వీటి నిర్వహణకు ప్రత్యేక ప్రక్రియను పాటించాలని, ఖచ్చితంగా నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. దీనికోసం ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. బయోమెడికల్‌ వేస్టే మేనేజ్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.