అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలను చర్చించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఆర్డిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డిఒ శీనానాయక్కు అర్జీనిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎస్కె రెహనా బేగం మాట్లాడుతూ గత 48 సంవత్సరాల నుండి ఇప్పటివరకు గ్రామాల్లో పట్టణాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన గర్భిణులు బాలింతలు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు సేవలు ప్రభుత్వ నిర్థేశిత ఉద్దేశాలు నెరవేర్చే దశలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, అతి తక్కువ గౌరవ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనికి తగిన వేతనాలు అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. నిరంతరం రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ అంగన్వాడీల వేతనాలు మాత్రం పెరగకపోవడం చాలా విచారకరమన్నారు. ఇప్పుడు ఇస్తున్న వేతనంతో వారు జీవనం సాగించడం చాలా కష్టమని, వీరికి కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని గ్రాడ్యుయేట్ అమలు చేయాలన్నారు. వర్కర్లను హెల్పర్లను మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. వీరికి ఆఖరి నెల జీతంలో సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని రాష్ట్రంలోని మినీ వర్కర్లను తక్షణం మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి చర్చించి అంగన్వాడీల సమస్యల అన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య, సిఐటియు కావలి పట్టణ కార్యదర్శి ఎర్రంశెట్టి కృష్ణమోహన్, వ్యకాసం జిల్లా ఉపాధ్యక్షులు టి.మాల్యాద్రి, సిఐటియు నాయకులు పసుపులేటి తిరుపాలు, అంగన్వాడీ నాయకురాలు కే విజయలత, సుభాషిణి, రఘురావమ్మ, శ్రీదేవి, జ్యోతిలక్ష్మి, రాధిక, సుకన్య, బిందు, శాంతి కుమారి, పెంచలమ్మ, రజిత, అరుణ, సౌజన్య, మరియమ్మ, వజ్రమ్మ, తిరుపతమ్మలతోపాటు అధిక సంఖ్యలో అంగన్వాలు పాల్గొన్నారు.










