Nov 18,2023 18:40

ప్రజాశక్తి - పెనుమంట్ర
            ఇప్పటికే 26 రకాల పనులు చేస్తున్న తమను వారి పనులు కూడా చేయాలని, లేకపోతే మా సంగతి చూస్తామని బెదిరిస్తున్న ఆశావర్కర్ల నోడల్‌ ఆఫీసర్‌ పిహెచ్‌ఎన్‌.ఉమాదేవి, హెచ్‌వి.అనంతలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ఆశావర్కర్లు కోరారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో మార్టేరు పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్‌ మల్లికకు శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు కె.సుబ్బరాజు మాట్లాడుతూ సదరు అధికారులు గ్రామాల్లో గర్భిణులను సందర్శించకుండా ఆశాలే ఆ పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు సరైన వైద్య సేవలు అందించని పిహెచ్‌సి అధికారులు ఉమాదేవి, అనంతలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని విచారణ జరిపించాలని, ఆశావర్కర్లపై వేధింపులు ఆపాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.