May 20,2023 19:40

తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలని, విద్యారంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామ్య, అశాస్త్రీయ, ఫెడరల్‌, ఫాసిస్టు విధానాలను మానుకోవాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గోట్ల చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షులు కరె కృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు అధ్యక్షతన మండల రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి హనీఫ్‌, రాయలసీమ విద్యావంతుల వేదిక కోకన్వీనర్‌ నాగన్న, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఏసేపు, ఆర్‌ఎవిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి ఖాజా, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గోట్ల చంద్రశేఖర్‌ మాట్లాడారు. ఢిల్లీలో జరుగుతున్న మహిళా రెజ్లర్ల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని తెలిపారు. డిటిఎఫ్‌ బాధ్యులు జయానంద్‌, శివశంకర్‌, రాజశేఖర్‌, రాజేంద్ర, రవీంద్ర, ఖాజా బాషా, ఈశ్వర్‌ రెడ్డి, వీరేష్‌, ఖాజా మొయిద్దీన్‌, రంగస్వామి, సోమశేఖర్‌, జయరాజు పాల్గొన్నారు.