ప్రజాశక్తి- భీమునిపట్నం మహిళలు ఆర్థిక స్వయంసమృద్ధి సాధించాలని డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.లక్ష్మీపతి స్వయం సహాయక సంఘసభ్యులకు సూచించారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్ క్రాంతి పథం కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య సమావేశంలో బ్యాంక్ లింకేజీ, బీమా, స్త్రీ నిధి, ఉన్నతి, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు అమలు తీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిఎం , పిఎంఇ పథకం ద్వారా ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద బ్యాంకుల ద్వారా ఏడాదికి రూ.426 తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా18-50 ఏళ్లు వయసు లోపు వారు రూ.2 లక్షలు జీవిత బీమా సదుపాయం పొందవచ్చన్నారు. సమావేశంలో సామాజిక భద్రత జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పి.వెంకటరమణ, ఏరియా కోఆర్డినేటర్ కె సత్యంనాయుడు, స్త్రీనిధి ఎజిఎం సునీత, ఎపిఎం బి.రంగారావు పాల్గొన్నారు.










