ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ ఒక యూనియన్కు కొమ్ము కాస్తూ పలు యూనియన్లు నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదని ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు చిరంజీవి అన్నారు. ఆదివారం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్యలకు నిరసనగా డిపో ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డిపో మేనేజర్ పూర్తిగా ఒక యూనియన్కి కొమ్ము కాస్తూ సీనియార్టీని పక్కనపెట్టి జూనియర్ మోస్ట్ డ్రైవర్కు చార్ట్ బ్లాంక్ ఇచ్చారని విమర్శించారు. అలాగే 281 చార్ట్ బుకింగ్లో అవకతవకలపై డిజిటల్ చార్ట్లు, అక్రమంగా వాడుతున్న ఓడిలను కూడా జిల్లా సీనియార్టీ ప్రకారం నోటీస్ బోర్డు ద్వారా తీసుకోవాలని అనేకమార్లు మొరపెట్టుకున్నప్పటికీ డిపో మేనేజర్ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే రెండు సర్వీసులకు కిలోమీటర్లు పెంచడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.










