సాలూరు: మున్సిపాలిటీల్లో మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం వారు డిప్యూటీ సీఎం రాజన్నదొరకి వినతిపత్రం అందజేశారు. ఆర్పీల సంఘం గౌరవాధ్యక్షులు ఎన్వైనాయుడు ఆధ్వర్యాన సంఘం సభ్యులు రాజన్నదొరను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలపరిమితి సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఒహెచ్ఆర్ అమలు చేయాలని కోరారు. గ్రేడింగ్ విధానం రద్దు చేసి పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. చదువు, వయసు, జెండర్ పేరుతో వేధింపులు, తొలగింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సెల్ ఫోన్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎన్.సుగణావతి, సహాయ కార్యదర్శి జి.అన్నపూర్ణ, సభ్యులు మహేశ్వరి,దేవి,హైమ పాల్గొన్నారు.










