Sep 28,2023 22:39

ప్రజశక్తి - చీరాల
ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉందని ఏపీ ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు అన్నారు. పట్టణంలోని పలు హాస్పిటల్స్‌ను ఆయన గురువారం సందర్శించారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ యాజమాన్యంను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి జనరల్, లాప్రోస్కోపీ ఆపరేషన్లు, హెర్నియా, ఎముకల ఆపరేషన్లు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. మొట్ట మొదటిసారిగా డయాలసిస్ సౌకర్యం కలిగిన ఏకైక హాస్పిటల్ అని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య చౌదరి, జనరల్ సర్జన్ కాటూరి శ్యాంబాబు, డాక్టర్ నరేష్, హాస్పిటల్ జిఎం తాడివలస సురేష్, ఆరోగ్య మిత్ర అనిల్ పాల్గొన్నారు.