ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మణిపాల్ హాస్పటల్స్ ఆధ్వర్యాన గుడ్ హెల్త్ రన్ నిర్వహించారు. విజయవాడలోని బిఆర్టిఎస్ రోడ్డులో నిర్వహించిన ఈ రన్ను ఆదివారం నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణాటాటా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా మణిపాల్ హాస్పటల్స్ ఇటువంటి రన్ నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాక్షించారు. ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. ప్రస్తుత వేగవంతమైన జీనవ విధానంలో మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మణిపాల్ హాస్పటల్స్ చక్కటి వైద్యం అందించంతోపాటు నగర వాసులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఇటువంటి రన్ నిర్వహించడం అభినందనీ యమన్నారు. మణిపాల్ హాస్పటల్స్ విజయవాడ యూనిట్ హెడ్ కంటిపూడి సుధాకర్ మాట్లాడుతూ తమ హాస్పటల్ ఆధ్వర్యంలో రెెండో సారి గుడ్హెల్త్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 10కె వాక్, 5కె వాక్ నిర్వహించినట్లు తెలిపారు.










