ప్రజాశక్తి-కాకినాడ, కరప జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తోందని ఆయన అన్నారు. సోమవారం కాజూలూరు మండలం గొల్లపాలెంలోని పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి వేణు స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.-ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరినీ తమ వారిగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రణాళికాయుతంగా పని చేస్తున్నట్టు తెలిపారు. వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్తో పాటు వివిధ స్పెషలిస్టు వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ రిఫరల్, బ్లడ్ టెస్ట్, బిపి, సుగర్ పరీక్షలు, ఫార్మసీ, న్యూట్రిషన్ కౌన్సిలింగ్ తదితర సేవలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇంట్లో ఎవరికైనా బాగోపోతే వారి పిల్లలో, బంధువులో ఆసుపత్రికి తీసుకెళ్తారని అదే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితి పేదలకు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడాలేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపాలెం సర్పంచ్ ప్రసన్న మౌనిక, జెడ్పిటిసి సుబ్బారావు, ఎంపిపి మాత భారతి మురళి, తహశీల్దారు సాయి సత్యనారాయణ, ఎంపిడిఒ రత్న రాజు పాల్గొన్నారు.
కరప మండలం సిరిపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. గ్రామ సర్పంచ్ నున్న సుజాత అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో ఎంపిపి పెంకే శ్రీలక్ష్మీ సత్తిబాబు, వైసిపి మండల అధ్యక్షుడు చింత ఈశ్వరరావు, ఎంపిటిసి ధనలక్ష్మి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
పెద్దాపురం మండలం ఆర్బి.కొత్తూరులో నిర్వహించిన శిబిరాన్ని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ప్రారంభించారు. ఉప సర్పంచ్ గోలి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పిటిసి గవరసాన సూరిబాబు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సర్పంచ్ అడ్డాల మరియమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ టివి.రమణమ్మ, పంచాయతీ కార్యదర్శి జ్యోతుల పద్మరాజు, ఎండ్రు సత్తిబాబు, పల్లా శ్రీనివాస్ యాదవ్, వల్లూరి కిట్టయ్య చౌదరి, గోలి రామకృష్ణ, జయ బాబు తదితరులు పాల్గొన్నారు.










