
ప్రజాశక్తి-మంగళగిరి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్టి కృష్ణబాబు అన్నారు. పట్టణంలోని మార్కండేయ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన శిబిరాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 12 వేల వైద్య శిబిరాలను నిర్వహించామని, మరో రెండు వేలు వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. క్యాంపుల్లో సుమారు 450 ఓపీలు వస్తున్నాయని, ఇప్పటి వరకు 50 లక్షల మంది హాజరయ్యారని, లక్ష మందిని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆసుపత్రులకు రిఫర్ చేశామని వివరించారు. ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించడం ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నామని, ఆ యాప్లో స్పెషాలిటీ ఆసుపత్రులు, ఆస్పత్రుల్లో సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిన విధానం, ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు ఉంటాయన్నారు. వీటిపై రూపొందించిన బ్రోచర్ను ప్రతి కుటుంబానికీ అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జైనివాస్, సీఈవో హరేంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణబాబు, రత్నప్రసాద్, మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ యు.శారదాదేవి, అడిషనల్ కమిషనర్ కె.హేమమాలిని, వైద్యులు ప్రియాంక, శృతి పాల్గొన్నారు.