హిందూపురం : వైద్య ఆరోగ్యాశాఖ కార్యక్రమాల అమలు చేసే భాధ్యత వైద్యాధికారులదేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో పట్టణ, రూరల్ మండల వ్యాప్తంగా ఉన్న వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీని కన్న ముందు పలు రికార్డులను పరిశీలన చేశారు. ఈ సందర్బంగా వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న కంప్యూటర్ ఆప్లికేషన్లతో అమలవుతున్న అన్ని కార్యక్రమాలనూ సిబ్బందితో సక్రమంగా అమలు చేయించాలన్నారు. వాటి రిపోర్టుల నిర్వహణతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా కషి చేయాలన్నారు. మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లలకు టీకాలు నిర్వహించాలన్నారు. హిందూపురం పట్టణంలో సంచరజాతులవారు, ఇతర రాష్ట్రాల కార్మికులు ఎక్కువ ఉన్నందున టీకాల కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డా||శ్రీదేవితో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.










