ప్రజాశక్తి- చిత్తూరు
'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంలో అందిన అర్జీలకు తగిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ ఎన్.రాజశేఖర్తో కలసి జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీల పరిష్కారం పై, రీసర్వే, రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లాస్థాయిలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహశీల్దార్లో వివిధ ప్రాధాన్యత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాంకి సంబంధించి వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్లకూడదని నిర్ణీత సమయం లోపల అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. రెవెన్యూకు సంబంధించి రీసర్వే, 22ఏలకు సంబంధించిన, రెవెన్యూ సంబంధింత అంశాలలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సీసీఎల్ఏ నియమనిబంధనలకు లోబడి పనిచేయాలని, నియమ నిబంధనలను అతి క్రమించి పనిచేసిన వారిపై కఠినచర్యలు తప్పవని విధినిర్వహణలో బాధ్యత వ్యవహరించాలని తెలిపారు. ఈనెల 19న జగనన్నకు తోడు కార్యక్రమం ఉందని ఇందుకు సంబంధించి లబ్ధిదారుల ఈ- కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని బీసీ వెల్ఫేర్ అధికారి రబ్బానీ బాషను జేసీ ఆదేశించారు. సచివాలయ సిబ్బంది పాఠశాల తనిఖీలలో భాగంగా వారికి కేటాయించిన అంశాలపై పూర్తిగా తనిఖీ చేయాలని, ఈ పని కచ్చితంగా జరిగేలా సంబంధిత జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ పద్మ నాభం, ఆర్ అండ్ బి ఎస్ఈ ఉమామహేశ్వర్ రెడ్డి, డిఎస్ఓ శంకరన్ జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజ్యలక్ష్మి, ఈడీఎస్సీ కార్పొరేషన్ నరసింహులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, మెప్మా పిడి రాధమ్మ, ఎడి సర్వే గౌస్బాషా, ఐసిడిఎస్ పిడి నాగశైలజ, డిఎల్డిఓ రవికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










