Sep 25,2023 22:08

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నకు చెబుదాం స్పందన గ్రీవెన్స్‌లో ప్రజలు ఇచ్చే అర్జీలకు మెరుగైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డిఎల్‌డివో శివారెడ్డి, డిఆర్డిఎ పీడీ నర్సయ్య, డిపిఒ విజరు కుమార్‌తో కలిసి కలెక్టర్‌ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్ధేశిత సమయంలోగా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. పునరావృతం అయిన అర్జీకు సంబంధించి అర్జీదారున్ని వ్యక్తిగతంగా కలిసి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ల నిర్మాణ పనులను అక్టోబర్‌ 30 నాటికి పూర్తి చేసి, సంబందితా శాఖలకు అందజేయాలని ఎంపిడిఒలు, పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. జగన్న లేఅవుట్‌లకు సంబంధించిన లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఎంహెచ్‌ఒ డా.కష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.