
ప్రజాశక్తి-గొలుగొండ: రోడ్డు సమస్యకు సిఎం జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకోవడంతో ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభం జరుగుతున్నాయని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ఆరిలోవ అటవీప్రాంతంలో సోమవారం సాయంత్రం రోడ్డు విస్తరణకు మార్కింగ్ పనులను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నర్సీపట్నం - కృష్ణదేవిపేట మార్గంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఉన్న 3.5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు జరగక పోవడంతో వాహనదార్లు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీనిపై ఎంతో మంది నాయకులు హామీలు ఇవ్వడం మినహా ఏనాడు పనులకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. రెండున్నర ఏళ్ల క్రితం ఈ రోడ్డు విస్తరణ చేసి గొలుగొండ మండలంలో ఉన్న 50వేల మంది ప్రజలతో పాటు ఇతర జిల్లాల ప్రజలకు ఈ రోడ్డు విస్తరణ చేసి ప్రజల కష్టాలు తీర్చాలని చర్యలు తీసుకోవడం జరిగిందని అయన తెలిపారు. ఈ సమస్యను పలుసార్లు సిఎం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు వారం రోజుల్లో ప్రారంభం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో జయరాం, డిఎఫ్ఒ రాజారావు, ఈఈ బాలసుందరబాబు, డీఈఈ కె.సిద్దార్థప్రభు, సిఐ రమణయ్య, తహసీల్దార్ ఆనందరావు, నర్సీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ చిటికెల భాస్కరనాయుడు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ మహిళా విభాగం అధ్యక్షరాలు లోచల సుజాత, మండల వైసీపీ అధ్యక్షలు లెక్కల సత్యన్నారాయణ, పిఎసిఎస్ మాజీ అధక్షులు కె.సత్యనారాయణ పాల్గొన్నారు.